గిద్దలూరు/ఒంగోలు: పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రకాశం జిల్లా గిద్దలూరు సహకార సంఘం అధ్యక్షుడు వైజా భాస్కరరెడ్డి (48) బలయ్యారు. గిద్దలూరులోని తన భవనంలో రెండు కుటుంబాల మద్య కారు పార్కింగ్ వివాదంలో స్థానిక ఎస్ఐ దౌర్జన్యాన్ని ప్రశ్నించిన పాపానికి.. ఎస్ఐ చేయిచేసుకోవటంతో ఆయన గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి 12.25 గంటల సమయంలో గిద్దలూరు పోలీస్స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డీజీఆర్ హాస్పిటల్ను నిర్వహిస్తున్న డాక్టర్ హరనాథరెడ్డి డీఆర్ఆర్ ప్లాజాలో నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో హీరోహోండా షోరూం నిర్వాహకుడు తోట సుబ్బారావు కుటుంబం నివాసం ఉంటోంది. వీరిద్దరి మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం చెలరేగింది. డాక్టర్ హరనాథరెడ్డి కుటుంబంపై సుబ్బారావు దాడికి దిగడమే కాకుండా తనకు అనుకూలంగా ఉండే ఎస్ఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన గిద్దలూరు ఎస్ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వీరంగం వేశాడు. డాక్టర్ హరనాథరెడ్డి, ఆయన తండ్రి, భార్య అందరినీ చితకబాదాడు. హరనాథరెడ్డి భార్యను మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించాడు.
డీఆర్ఆర్ ప్లాజా యజమాని అయిన వైజా భాస్కరరెడ్డి సమాచారం తెలుసుకుని పోలీస్స్టేషన్కు వెళ్లేసరికి డాక్టర్ అని కూడా చూడకుండా ఆయనను కింద కూర్చోబెట్టాడు. సుబ్బారావును కుర్చీలో కూర్చోబెట్టాడు. దీంతో ఆగ్రహించిన భాస్కర్రెడ్డి డాక్టర్కు ఇచ్చే మర్యాద ఇదేనా అని సీఐ రామారావును ప్రశ్నించారు. మహిళను అవమానించటం సరికాదని ఖండించారు. ఈ సమయంలో వచ్చిన ఎస్ఐ శ్రీనివాసరావు సీఐ సమక్షంలోనే భాస్కరరెడ్డిపై దౌర్జన్యానికి దిగి చేయిచేసుకున్నాడు. దీంతో ఆయన గుండెల్లో నొప్పి అంటూ కుప్పకూలిపోయారు. మంచినీళ్లు తాగి కాసేపు కూర్చున్నా శ్వాస అందడం లేదంటూ బయటకు వచ్చి నేలకొరిగి చనిపోయాడు. స్థానిక వైద్యశాలకు తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని భాస్కర్రెడ్డి మృతదేహాన్ని పోలీస్స్టేషన్లో ఉంచి పార్టీ అనుచరులతో కలిసి పోలీస్స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ఎస్ఐ శ్రీనివాసరావుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ రామానాయక్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత అయిన వైజా భాస్కర్రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యలను పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం ఫోన్లో పరామర్శించారు. పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించిన ఆయన భాస్కరరెడ్డి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
రక్తచరిత్ర కాదు.. కొత్తచరిత్ర: వాసిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాష్ట్రానికి కావాల్సింది కొత్త చరిత్రే తప్ప రక్త చరిత్ర కాదని, సీఎం చంద్రబాబు ఫ్యాక్షనిసు ్టలా కాకుండా ప్రజలందరికీ ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. భాస్కరరెడ్డిని పోలీసులే అన్యాయంగా చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు
Recent Comments